గతంలో ఓసారి భారత బలగాలు పాక్ భూభాగంలోకి వెళ్లి మెరుపుదాడులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దని గట్టిగానే హెచ్చరించారు అమిత్ షా.
గోవా పర్యటనలో ఉన్న అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పూంచ్లో భారత ఆర్మీ క్యాంప్పై దాడి చేసిన పాక్ ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని అమిత్ షా తెలిపారు. అమిత్షా , ఉగ్రదాడులను అరికట్టడానికి మళ్లీ సర్జికల్ స్ట్రయిక్స్ చేయడానికి భారత బలగాలు సిద్దంగా ఉన్నాయని హెచ్చరించారు.
అతిక్రమణకు పాల్పడితే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. భారత సైన్యంపై జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని స్ట్రైక్స్ తప్పవు అని అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్. ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం చేయకూడదన్న గట్టి సందేశం దీని ద్వారా వెళ్లింది. ఒకప్పుడు చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టే సమయం అని అమిత్ షా అన్నారు. గోవాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడానికి వెళ్లిన అమిత్ షా ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.