అమరావతి: ఏపీలో 1681 మిడ్ లెవల్ హెల్త్ సూపర్ వైజర్ పోస్టుల(ఎంఎల్హెచ్పీ) భర్తీ ప్రక్రియపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య క్లినిక్లు-ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల్లో 1681 ఎంఎల్హెచ్పీ నియామకం కోసం ఈ ఏడాది ఆగస్టు 9న ప్రజాఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మిషన్ డైరెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని సవాలుచేస్తూ వైద్యులు పి.అనీల్కుమార్, శివకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఈ ప్రక్రియలో ముందుకెళ్లడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.
ఈ తీర్పుపై డివిజినల్ బెంచ్లో శివకృష్ణ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా ఆయుష్ డాక్టర్ల పేర్లను పరిశీలనలోకి తీసుకోకుండా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. జాతీయ ఆరోగ్య విధానం-2017, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా ఎంఎల్హెచ్పీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం.. బీఎస్సీ(నర్సింగ్)ను విద్యార్హతగా పేర్కొన్నారని వివరించారు. దేశంలోని ఏపీ మినహా అన్ని రాష్ట్రాలు పోస్టుల భర్తీలో ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం తరఫున భర్తీకి అవకాశం ఇవ్వాలని.. రాబోయే ఎంపికల్లో వారి పేర్లను పరిశీలనకు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. అనంతరం ఎంఎల్హెచ్పీ పోస్టుల భర్తీ ప్రక్రియపై స్టే విధించింది.