Crimea Russia అనుసంధానం వంతెన కెర్చ్ పేల్చివేతపై రష్యా ఆగ్రహంతో ఊగిపోతోంది. వంతెన కూల్చివేతకు ప్రతీకారంగా సోమవారం నుంచి ఉక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. క్షిపణి దాడులు చేసింది. జూన్ 26 తర్వాత మళ్లీ కీవ్ నగరంపై రష్యా సైన్యం దాడులు చేయడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు.
ప్రధానాంశాలు:
- మరోసారి ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
- కెర్చ్ వంతెన కూల్చివేతతో మాస్కో ప్రతీకారం
- తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆయన ఓ నటుడని, ఉక్రెయిన్ను ఆక్రమించుకునే విషయంలో తప్పుగా అంచనా వేశాడని బైడెన్ విమర్శించారు. సీఎన్ఎన్ టెలివిజన్ ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్పై దండయాత్రలో సామూహిక విధ్వంసక ఆయుధాలను ఆశ్రయించే ముందు తన సైనిక సామర్థ్యాన్ని పుతిన్ తప్పుగా అంచనా వేశాడని అన్నారు. గతవారం కెర్చ్ వంతెన పేల్చివేత తర్వాత రష్యా ప్రతీకారానికి తెగబడుతోంది. ఉక్రెయిన్పై సోమవారం క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. మంగళవారం కూడా దాడుల జోరు కొనసాగించింది. ఈ నేపథ్యంలో రష్యాను ఉద్దేశించి బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
- ఇదే సమయంలో పుతిన్తో చర్చల విషయమై కూడా బైడెన్ స్పందించారు. వచ్చే నెలలో బాలి వేదికగా జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి పుతిన్, బైడెన్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అంశంపై పుతిన్తో చర్చలపై ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పారు. ‘‘అతను (పుతిన్) G20 సమావేశంలో నా దగ్గరకు వచ్చి ‘‘నిర్బంధంలో ఉన్న అమెరికా బాస్కెట్బాల్ ఆటగాడు గ్రైనర్ విడుదల గురించి మాట్లాడాలనుకుంటున్నాను’ అని చెబితే, నేను అతనిని కలుస్తాను.. నా ఉద్దేశం అతడి ప్రతిపాదనపై ఆధారపడి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
పలు నగరాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస భవనాలతో పాటు విద్యుత్తు ప్లాంట్లను లక్ష్యంగా చేసుకొని తాజా దాడులు జరిగాయి. జపోరిజియా నగరంపై పుతిన్ సేనలు 12 క్షిపణులను ప్రయోగించాయి. భీకర దాడుల నేపథ్యంలో కీవ్ సహా పలు నగరాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనతో వణికిపోతున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు. మరోవైపు- ఉక్రెయిన్పై రష్యా సోమవారం జరిపిన దాడుల్లో మొత్తం 19 మంది మృత్యువాతపడ్డారని, 105 మంది గాయపడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్కు ఆయుధ, సైనిక సాయం విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన జో బైడెన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. అయితే నిర్దిష్టంగా ఏ వ్యవస్థలను అందజేయనున్నారో అమెరికా స్పష్టం చేయలేదు.
మరోవైపు- రష్యా హెచ్చరికలను పెడచెవిన పెడుతూ తమ వార్షిక అణు విన్యాసాలపై ముందుకు వెళ్లాలని.. ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చే వారం వాటిని నిర్వహించి తీరాలని నాటో నిర్ణయించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన జి-7 దేశాల నేతలు.. తాము ఉక్రెయిన్కు ఎంతకాలమైనాసరే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి సదస్సును ఉద్దేశించి జెలెన్స్కీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మంగళవారం ప్రసంగించారు.