ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్సమలిన్ బేబీ కాఫ్ సిరప్, మెకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మ్యాగ్రిప్ ఎన్ కోల్ సిరప్లు.. డబ్ల్యూహెచ్వో ప్రస్తావించిన దగ్గు మందుల జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు ఔషధాలను గాంబియలో పిల్లలు వాడినట్లు గుర్తించారు. అనధికార మార్కెట్ల ద్వారా ఇక్కడి ప్రాంతాలకు చేరి ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అయితే, వీటిని భారత్లోని మైడెన్ ఫార్మ తయారు చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నమూనాలను ల్యాబ్కు పరీక్షల కోసం పంపింది.
ప్రధానాంశాలు:
- దగ్గు మందు కారణంగా చనిపోయిన పిల్లలు
- గాంబియా ఘటనపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- ప్రమాదకర రసాయనాలు వాడినట్టు నిర్ధారణ
పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి భారత్లో తయారుచేసిన నాలుగు దగ్గు మందులతో సంబంధం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గతవారం వెల్లడించిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ఈ దగ్గు మందు ఉత్పత్తిపై హరియాణా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేసింది.
‘‘సోనిపట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్న మూడు ఔషధాల నమూనాలను కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్కు పంపారు.. నివేదికలు అందాల్సి ఉంది.. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం’’ అని హరియాణ ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అంతేకాదు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో దాదాపు 12 లోపాలను గుర్తించాయని పేర్కొన్నారు. వీటిలో దృష్టిలో ఉంచుకుని మొత్తం ఉత్పత్తిని నిలిపేయాలని నోటీసులు జారీచేసినట్టు మంత్రి వెల్లడించారు.
ఆ సంస్థకు జారీ చేసిన షోకాజ్ నోటీసులో కంపెనీ సందేహాస్పద ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, సాధనాల లాగ్ బుక్ను తయారు చేయలేకపోయిందని పేర్కొంది. దగ్గు సిరప్ల తయారీ కోసం పొందిన ప్రమాదకరమైన రసాయనాల బ్యాచ్ సంఖ్యను పేర్కొనలేదు. ఈ రసాయనాలలో ప్రొపైలిన్ గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పారాబెన్ ఉన్నాయి.
‘సందేహాస్పదమైన సిరప్ల తయారీలో ప్రక్రియ, పద్ధతులను ధ్రువీకరించడంలో కంపెనీ విఫలమైంది. ప్రొపైలిన్ గ్లైకాల్ బ్యాచ్ను కంపెనీచే విశ్లేషించి ప్రామాణిక నాణ్యతగా ప్రకటించింది.. కొన్ని అంశాలలో ఇది విఫలమైంది.. సందేహాస్పద దగ్గు సిరప్ల పరిశోధకులకు ప్రక్రియలో పరీక్షల నివేదికలు అందించలేదు’’ అని పేర్కొంది.