‘అవసరమైనప్పుడు తగ్గాలి.. అవసరమైనప్పుడు తిరగబడాలి’.. పొత్తు రాజకీయాల్లో పవన్ వ్యూహాత్మక అడుగులు!

S7 News
0

పొత్తులతోనే ముందుకెళ్తాం.. ముందు వైసీపీని అధికారం నుంచి దింపాలి. తర్వాతే సీఎం ఎవరన్నది చూద్దామని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీని బతికించుకోవడానికి తన ముందు ఇంతకు మించిన మార్గం లేదనే భావనలో పవన్ ఉన్నారు.


వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పని చేసే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పవర్ షేరింగ్‌కు టీడీపీ అంగీకరిస్తేనే.. పవన్ కళ్యాణ్‌‌ను కూడా సీఎంగా చేస్తామంటేనే టీడీపీతో పొత్తుకు తాము సిద్ధమని లేదంటే తమదారి తాము చూసుకుంటామని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. కానీ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం పదవి విషయమై చేసిన వ్యాఖ్యలు విన్నాక చాలా మంది జనసైనికులకు షాక్ తగిలినట్లయ్యింది. పొత్తులు కచ్చితంగా ఉంటాయని.. తాను సీఎం పదవిని డిమాండ్ చేయబోను అన్నట్టుగా పవన్ మాట్లాడారు. పవన్ ఈ వ్యాఖ్యలు చేశాక.. అధికార పార్టీ ఆయన్ను చంద్రబాబు బానిసగా అభివర్ణించింది. చంద్రబాబును సీఎం చేయడానికే ఆయన పార్టీ పెట్టారని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లపాటు పవన్ వెంట నడిచిన కొందరు జనసైనికులకు సైతం పవన్ వ్యాఖ్యలు రుచించడం లేదు. సీఎం పదవి వద్దనడం ద్వారా పవన్ వ్యూహాత్మక తప్పిదం చేశారంటున్నారు. మరి కొందరు మాత్రం పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారని అంటున్నారు.


టీడీపీకి వచ్చిందే 23 సీట్లు కదా..!

గత ఎన్నికల్లో తమ పార్టీ 137 స్థానాల్లో పోటీ చేసిందన్న పవన్ కళ్యాణ్.. 30-40 స్థానాల్లో గెలిచి ఉండుంటే సీఎం పదవి డిమాండ్ చేయడానికి వీలుండేదన్నారు. కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే 23 స్థానాలకు పరిమితమైన విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. జగన్ ప్రభంజనం ముందు క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉన్న టీడీపీనే నిలువలేకపోయింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం మినహా.. పెద్దగా గ్రౌండ్ వర్క్ లేని జనసేన ఘోరంగా ఓడిపోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఈ విషయాన్ని పక్కనబెట్టి.. సీఎం పదవి గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకు రుచించడం లేదు.


పొత్తు ముందు.. పదవి ప్రస్తావన తర్వాత..!

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. తాను సీఎం పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడగబోను అని ఆయన చెప్పడంలేదు. గురువారం మీడియాతో భేటీ చివర్లో ఆయన మాట్లాడుతూ.. తాము కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి వరించి తీరాలన్నారు. దాని కోసమే తాము పని చేస్తున్నామన్నారు. ‘పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తప్పితే.. పొత్తు ఉండదని మన నాయకులే అంటున్నారు. వేరే పార్టీ వాళ్లు కూడా ఇలాగే అనుకుంటారు కదా’ అంటూ సొంత పార్టీ నేతలకు జనసేనాని కౌంటర్ ఇచ్చారు. తమ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా ఉంటే పొత్తు పెట్టుకోవడానికే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు. అంటే సీఎం పదవి డిమాండ్‌తో పొత్తుల ప్రస్తావనను మొగ్గలోనే తుంచేయడం తనకు ఇష్టలేదన్నట్టుగా పవన్ వ్యాఖ్యలున్నాయి.


వైసీపీ ఓడించడమే ప్రథమ లక్ష్యం

పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తే.. ఆయన ప్రధాన లక్ష్యం వైసీపీని గద్దె దింపడంలా కనిపిస్తోంది. ఆ తర్వాత తమ బలాన్ని బట్టి ఏ పదవి కావాలో మిత్ర పక్షాన్ని డిమాండ్ చేయాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సమావేశంలోనే పవన్ మాట్లాడుతూ.. తమ పార్టీ బలం గత ఎన్నికలతో పోలిస్తే కచ్చితంగా రెట్టింపు అయ్యిందన్నారు. రాయలసీమ లాంటి ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో తాము బలంగా ఉన్నామన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తమ బలం 36 శాతం నుంచి 38 శాతం వరకూ ఉందన్నారు.


మన బలమేంటో తెలుసుకోవాలి కదా..

పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ పవన్ కళ్యాణ్ టీడీపీకి నేరుగా చెప్పేశారు. టీడీపీ నేతలను సీఎం చేయడానికి జనసేన లేదు.. కానీ మన బలమేంటో ముందుగా బేరిజు వేసుకోవాలంటూ జనసైనికులకు పవన్ హితబోధ చేశారు. సీఎం పదవి గురించి చేసిన వ్యాఖ్యల ద్వారా తాను ఓ మెట్టు దిగాననే సంకేతాలు ఇచ్చారు. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా అనే పదాన్ని జనసేనాని పదే పదే వాడటాన్ని బట్టి చూస్తే.. తమకు సముచితమైన సంఖ్యలో సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)